బుధవారం, 12 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మార్చి 2025 (17:56 IST)

ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న బీజేపీ ఎంపీ.. మద్దతు తెలిపిన మహా సీఎం!!

Aurangzeb's Tomb
మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉండగా, ప్రస్తుతం ఈ సమాధిని తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా, ఈ సమాధిని జేసీబీలతో కూల్చివేయాలంటూ బీజేపీకి చెందిన ఓ ఎంపీ డిమాండ్ చేశారు. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం మద్దతు ఇస్తూనే ఈ సమాధి తొలగింపు అన్నది జేసీబీలతోకాకుండా, న్యాయపరంగా తొలగించాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఔరంగజేబు సమాధి ఉన్న స్థలాన్ని జాతీయ పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలో ఉందని కాంగ్రెస్ గుర్తుచేసింది. 
 
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని ఖులాబాద్‌లో ఔరంగజేబు సమాధి ఉంది. దీన్ని తొలగించాలని, అయితే, ఇది చట్ట ప్రకారమే జరగాలని అభిప్రాయపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ సమాధి ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు ఇప్పగించింది. దీంతో ఆ ప్రాంతం ఏఎస్ఐ సంరక్షణలో ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫడ్నవిస్ తప్పబట్టారు.  
 
మరోవైపు, మహా సీఎం ఫడ్నవిస్ వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన సతారా స్థానం ఎంపీ, ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్ రాజె భోసాలె స్పందించారు. ఓ దొంగకు ఏర్పాటు చేసిన సమాధాని తొలగించడానికి చట్టాలతో పనేముందని, సింపుల్‌గా ఓ  బీసీబీని పంపిచిన ఔరంగజేబు సమాధిని నేలమట్టం చేయాలని కోరారు. 
 
ఔరంగజేబు సమాధిని సందర్శించి నివాళులు అర్పించాలని భావించే వారు ఈ శకలాలను తీసుకెళ్లి వాళ్ల గృహాల్లో పెట్టుకోవచ్చంటూ ఎంపీ సూచించారు. అంతేకానీ, మరాఠా గడ్డపై ఔరంగజేబు‌ను కీర్తిస్తే ఇకపై సహించబోమని ఆయన హెచ్చరించారు. కాగా, ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ఔరంగజేబును ప్రశంసిస్తూ ఎమ్మెల్యే అబు అజ్మీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఉదయ్ రాజే భోసాలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఛత్రపతి శివాజీ, రాజమాత జిజావు ఛత్రపతి, శంభాజీ మహారాజ్‌లను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు.