IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలంలోకి ఇండిగో ఫ్లైట్ కొద్ది క్షణాలు వెళ్లేందుకు లాహోర్ ఏటీసీని సంప్రదించారు ఇండిగో పైలట్లు. కానీ పాకిస్థాన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఢిల్లీ నుంచి శ్రీనగర్కు 227మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఇండిగో 6ఇ 2142 విమానం పఠాన్కోట్ సమీపంలో భయానక వాతావరణాన్ని ఎదుర్కొంది.
ఉరుములు, మెరుపులతో కూడిన కారుమేఘాలు.. విమానం మెల్లగా ముందుకు సాగితే ప్రయాణికులందరికీ ప్రాణహాని తప్పదు. దీంతో ప్రమాదకరమైన మేఘాల కారణంగా దారి మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు ఇండిగో పైలట్లు.
ఇందులో పాక్ అనుమతి కోరారు. కానీ పాక్ అందుకు అంగీకరించలేదు. దీంతో ప్రమాదకరమైన మేఘాల్లోకి ప్రవేశించక తప్పలేదు. వెంటనే తీవ్ర వడగళ్ల వాన మొదలైంది. యాంగిల్ ఆఫ్ ఎటాక్ లోపంతో విమానం కంట్రోల్ తప్పిపోయే స్థితికి చేరింది. విమానం స్టాల్కు చేరకముందే పైలట్లు దానిని తిరిగి తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
సాధారణంగా నిమిషానికి 1,500-3,000 అడుగులు కిందకు వచ్చే విమానం.. ఈ సమయంలో నిమిషానికి 8,500 అడుగుల వేగంతో కిందకు జారింది. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ సీట్లు పట్టుకున్నారు. పైలట్ల చాకచక్యంతో ప్రయాణికులెవరూ గాయపడలేదు.
కారుమేఘం నుంచి బయటకు తీసుకువచ్చి శ్రీనగర్ చేరుకున్నారు. దీంతో ప్రయాణీకులు జాగ్రత్తగా ల్యాండ్ అయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో పాక్పై విమర్శలు వెల్లువెత్తాయి. వందలాది మంది ప్రజల ప్రాణాలతో పాక్ చెలగాటం ఆడుకుందని.. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు ఇదో లెక్క కాదని నెటిజన్లు అంటున్నారు.