మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జనవరి 2017 (12:45 IST)

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా.. శశికళ చేతిలో లేఖ?

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాజీనామా చేసినట్టు పుకార్లు వస్తున్నాయి. ఆయన రాజీనామా లేఖ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ధృవీ

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాజీనామా చేసినట్టు పుకార్లు వస్తున్నాయి. ఆయన రాజీనామా లేఖ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. 
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రంతో పాటు అన్నాడీఎంకేలో రోజుకోరీతిన జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు ఇచ్చేశారని మంగళవారం అన్నాడీఎంకే నాయకులు చెప్పారు. జయలలిత మరణించిన తర్వాత అదేరోజు అర్థరాత్రి తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
 
ఇటీవల అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న ఉదయ్ కుమార్, లోక్‌సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై తదితరులు శశికళ సీఎం కావాలని మీడియా ముందు బహిరంగంగా చెప్పారు.
 
శశికళ కోసం పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేసి త్యాగం చేస్తారని వారు అన్నారు. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో విసుగు చెందిన పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను శశికళకు ఇచ్చేశారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
 
అయితే ఈ విషయంపై పన్నీర్ సెల్వం కాని, శశికళ కాని ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. శశికళ ఎప్పుడు సీఎం కావాలనుకుంటే ఆ రోజు పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామా లేఖను బయటపెడుతారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.