ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (10:52 IST)

కెమికల్ సేవించి చిన్నారి మృత్యువాత

తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఓ విషాదకర ఘటన సంభవించింది. అభంశుభం తెలియని చిన్నారి ఒకరు రసాయనం తాగి మృత్యువాతపడింది. ఈ హృదయ విదారక సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం రాచూర్‌లో చోటుచేసుకుంది. 
 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జ్యోతిక - సూర్యకాంత్‌ దంపతుల పెద్ద కుమార్తె అదిత్య(5) శనివారం అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చింది. ఆ సమయంలో గదిలో ఉన్న రసాయనం తాగి స్పృహ తప్పి పడిపోయింది. కొంతసేపటికి గమనించిన కేంద్రం నిర్వాహకురాలు నగరబాయి.. పాపను చిన్నారి ఇంటికి తీసుకువెళ్లింది. 
 
ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని దెగ్లూర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. మార్గమధ్యంలో అదిత్య మృతి చెందింది. ఈ విషయంపై సీడీపీవో సునందను సంప్రదించగా చిన్నారి మృతి చెందినట్లు సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలుసుకుంటామని సమాధానమిచ్చారు.