1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (13:58 IST)

మందులో సోడా కలిపినవారికే మంత్రి పదవులు!: కేసీఆర్‌పై రేవంత్ ధ్వజం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆ ప్రాంతానికి చెందిన నేత, టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్ రెడ్డి మరోమారు మాటల తూటాలు పేల్చారు. తన సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. ఆదివారం వనపర్తిలో జరిగిన సమావేశంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
‘మందులో సోడా పోసినోళ్లకే మంత్రి పదవులు’ లభిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆంద్రోళ్ల కమీషన్లకు కేసీఆర్ దాసోహమయ్యారని విమర్శించిన రేవంత్ రెడ్డి, వలస నేతలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క మహిళకు కూడా తెలంగాణ కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి ఎందుకుందని ఆయన ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నికైన మహిళా ఎమ్మెల్యేల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహించే సామర్థ్యం లేదా అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని డప్పు కొడుతున్న కేసీఆర్.. తన మంత్రివర్గంలో ఒక్కరికి కూడా మంత్రి పదవిని ఎందుకు కేటాయించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.