ఏపీ పునర్విభజన చట్టాన్ని చదివి రండి... తెలంగాణ ఏజీకి హైకోర్టు మొట్టికాయ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్కు ఉమ్మడి హైదరాబాద్ హైకోర్టు మొట్టిక్కాయ వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని బాగా చదివి.. కోర్టుకు రావాలంటూ హితవు పలికింది.
గ్రేటర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార తెరాస ఎక్స్అఫీసియో చట్టానికి మార్పులు చేయడాన్ని బుధవారం హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. దీనిపై గురువారం మరోమారు విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తన వాదనలు వినిపించారు.
చట్టం చేసిన రెండేళ్లలోపు దానికి ఎన్నిసార్లైనా సవరణ చేసే వీలుందని చేసిన ఏజీ వాదనతో ధర్మాసనం విభేదించింది. చట్టానికి ఒకసారి మాత్రమే సవరణ చేసే అవకాశముందని, అయినా ఏపీ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకోకుండా కోర్టుకు ఎలా వస్తారని ఏజీకి కోర్టు మొట్టికాయ వేసింది. ఈసారైనా కోర్టుకు వచ్చేటప్పుడు విభజన చట్టాన్ని పూర్తిగా చదువుకుని రావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆగ్రహంతో ఏజీ నోట మాట రాలేదట.