మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 జులై 2020 (09:59 IST)

తెలంగాణాలో జూలై 31వ వరకు లాక్డౌన్.. తగ్గని కరోనా ఉధృతి

తెలంగాణ రాష్ట్రంలో జూలై 31వ తేదీ వరకు లాక్డౌన్‌ను పొడగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీచేశారు. 
 
కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఈ జీవో జారీ చేశారు.
 
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన లాక్‌డౌన్ జీవో ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసరం(మెడికల్ ఎమర్జెన్సీ) అయితే తప్ప ఎవరూ బయటకు రాకూడదు. 
 
ఆసుపత్రులు, మెడికల్ షాపులు, అత్యవసరాల దుకాణాలు తప్ప మిగితా షాపులు ఏవీ రాత్రి 9.30 గంటల తర్వాత తీసి ఉంచడానికి వీలు లేదు. అత్యవసర సేవలకు సంబంధించిన వారికి మాత్రమే బస్సులు, రైళ్లు, విమానల ద్వారా ప్రయాణానికి అనుమతి ఉంటుంది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ కూడా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 945 పాజిటివ్ కేసులు వచ్చాయి. వాటిలో 869 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు. 
 
రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చెల్ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. ఇవాళ్టి కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,339కి పెరిగింది.
 
తాజాగా 1,712 మందిని డిశ్చార్జి చేయడం విశేషం అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఒకేరోజు ఇంతమంది డిశ్చార్జి అయిన దాఖలాలు లేవు. యాక్టివ్ కేసుల సంఖ్య 8,785. తాజాగా ఏడుగురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 260కి చేరింది.