IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?
చాలామంది తాము చేసే వృత్తిలో సంతృప్తి లేదని మథనపడుతుంటారు. ఇది ఎక్కువగా ఐటీ పరిశ్రమలో కనబడుతుంటుంది. రోజూ రోబోలా 24 గంటలూ పని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని గానుగెద్దులా గడిపేస్తున్నాం బ్రో అంటూ చాలామంది బాధపడుతుంటారు. ఒకవైపు పని ఒత్తిడి, ఇంకోవైపు కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం లేక పాపం నలిగిపోతుంటారు. దీనికితోడు ఇప్పుడు కొత్తగా ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే జంటల్లో సంతానలేమి సమస్యలు తగులుకుంటున్నాయి. దీనితో చాలామంది తాము చేసే ఉద్యోగాలకు స్వస్తి చెప్పి తమకు నచ్చిన బాటలో పయనిస్తున్నారు. చివరికి హాయిగా వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని గడిపేవారు సైతం ఇప్పుడు ఎక్కువవుతున్నారు. ఇలాగే తనకు ఇష్టమైన వృత్తిని ఎంచుకున్నాడు ఓ ఐటీ టాప్ ప్రొఫెషనల్. ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీ ఉద్యోగాన్ని వదిలేసి తనకు నచ్చిన పని కోసం వచ్చేసాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
అతడి పేరు రోహన్ మిట్టల్. ఫరిదాబాద్ సెక్టర్ 16కి చెందినవాడు. రూర్కీ నుంచి 2016లో ఐఐటి గ్రాడ్యుయేట్ పూర్తి చేసాడు. ఇక అప్పట్నుంచి కార్పొరేట్ ప్రపంచంలో ఆయా కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు చేసాడు. చివరికి గురుగ్రాంలో అతడికి ఏడాదికి కోటి రూపాయల ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఆఫర్ చేసారు. కానీ ఎందుకో అతడికి జీవితంలో వెలితిగా అనిపించేది. ఉద్యోగంలో సంతృప్తి వుండేది కాదు. ఐతే అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు అతడిని డౌట్స్ అడిగేందుకు వస్తుండేవారు.
వారితో అలా కూర్చుని వారి డౌట్స్ క్లియర్ చేస్తూ అలా పచ్చని చెట్ల మధ్య కూర్చుని వుండటం హాయిగా అనిపించేది. తనకు సంతృప్తినిస్తున్నది ఏదైనా వుందంటే అదేననిపించింది. అంతే... వెంటనే ఆగస్టు 2024లో ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. వెల్డన్ క్లాసెస్ అంటూ కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసాడు. వారికి ఎలాంటి డౌట్స్ వచ్చినా క్లియర్ చేస్తూ మంచి టీచర్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం అతడు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థులకు బోధన చేస్తున్నాడు. రోహన్ మాస్టారు చెప్పే టీచింగ్స్ కోసం ఇప్పుడు ఎంతో రద్దీ ఏర్పడింది. విద్యార్థులకు అలా చదువు చెపుతూ కాలం గడపటంలో తనకు ఎంతో సంతృప్తి వుందంటున్నాడు రోహన్. ఇక డబ్బు విషయానికి వస్తే... సంపాదన గురించి తనకు ఎంతమాత్రం ఆసక్తి లేదని అంటున్నాడు ఈ ఉపాధ్యాయుడు.