హోదాపై నిలదీసేందుకు పవన్కు ఎంత సమయం కావాలో? : బొత్స
ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఎంత సమయం కావాలంటూ వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను తక్షణం కల్పించాలని కోరుతూ వైకాపా శనివారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోదా కాకుండా ప్యాకేజీ వస్తే అది పెద్దల పంపకానికే సరిపోతుందన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే హోదా రావట్లేదని, ఇందుకోసం తాము తలపెట్టిన బంద్ను విఫలం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హోదా వచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇకపోతే హోదా సంజీవిని కాదంటున్న నేతలు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఇంకొంత కాలం వేచిచూద్దామన్న పవన్ మాటలపై బొత్స స్పందిస్తూ, హోదాపై ఎంత సమయం కావాలో పవన్ చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, ప్రత్యేక హోదా వస్తే ఒక్కో పట్టణం ఒక్కో హైదరాబాద్లా తయారవుతుందన్నారు. పైగా హోదాతోనే పరిశ్రమలకు మనుగడ, యువతకు ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగ అవకాశాలు కోల్పోయామన్నారు.