1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మురళి
Last Updated : సోమవారం, 20 మే 2024 (13:02 IST)

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

sinare
దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం'. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రసారంకానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ రామ్ చెరువు మాట్లాడుతూ, విశ్వనాథ్‌తో విశ్వనాథామృతం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు 2011లో సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిశాం. ఆయన దగ్గరకు ఎవరు వెళ్లినా ముందు తన పాట ఒకటి పాడి వినిపిస్తుంటారు. అలా మాకు కొన్ని పాటలు వినిపించారు. అవి సూపర్ హిట్ సాంగ్స్ కాదు కానీ సాహిత్యపరంగా ఎంతో విలువైన పాటలు. ఆ పాటలు, ఆ పాటల వెనక సీతారామశాస్త్రి చేసిన కృషి గురించి తెలుసుకున్న తర్వాత ఈ మాటలు మాకే కాదు అందరికీ తెలియాలనే ఆలోచన కలిగింది. సిరివెన్నెల అంతరంగం పేరుతో నాలుగు ఎపిసోడ్స్ చేశాం. సీతారామశాస్త్రి తన పాట గురించి వివరించిన తర్వాత ఆ పాటను సింగర్స్ పాడేవారు.

కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ లేకుండా సింగర్స్‌తో కేవలం లిరిక్స్ పాడించాం. మూడు ఎపిసోడ్స్ అనుకున్నది 13 ఎపిసోడ్స్ చేశాం. దీన్ని టీవీ, ఇతర మాధ్యమాల ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకురావాలని అనుకున్నప్పుడు ఇతర పనులతో బిజీగా ఉండి శాస్త్రి ఆసక్తి చూపించలేదు. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కొన్ని రోజులకు సీతారామశాస్త్రి మనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంను ఎలా ప్రేక్షకులకు చేర్చాలి అనుకుంటున్నప్పుడు త్రివిక్రమ్ మాకు సపోర్ట్ చేశారు. ఈటీవీలో ప్రసారం గురించి బాపినీడు ఎంతో సపోర్ట్ చేశారు. నాతో పాటు మా టీమ్‌లోని వాళ్లంతా శాస్త్రి అభిమానులే. సీతారామశాస్త్రి మాట అందరికీ చేరాలని చేసిందే ఈ చిన్న ప్రయత్నం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం అన్నారు.
 
సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ్ శాస్త్రి మాట్లాడుతూ, మనమంతా ఒక కారణంతో ఈ భూమ్మీదకు వస్తాం. అలా ఒక బృహత్తరమైన బాధ్యతతో పుట్టారు అన్నయ్య సీతారామశాస్త్రి. తన కర్తవ్యాన్ని ముగించి వెళ్లిపోయారు. ఉన్నంతకాలం శ్రమ చేస్తూనే ఉన్నారు. ఎన్నో విలువైన పాటలను మనకు అందించారు. ఆ పాటలతో సమాజాన్ని మేల్కొలిపారు. అన్నయ్య సినిమా పాటల రచయిత కాకుండా ఇంకా గొప్ప స్థాయిలో ఉండేవారని కొందరు అంటారు కానీ అన్నయ్య ఆ మాట ఒప్పుకోడు. సినిమా మాధ్యమం వల్లే ఇంత విస్తృతంగా తన పాట ప్రజల్లోకి వెళ్లిందని అనేవారు. అన్నారు.
 
సింగర్ పార్థసారధి మాట్లాడుతూ, సీతారామశాస్త్రి లాంటి గొప్ప గేయ రచయిత ఉండటం తెలుగు సినిమా అదృష్టం. ఆయన పాటలు పాడే గొప్ప అవకాశం నాకు రావడం గర్వంగా భావిస్తున్నా. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఇది పూర్తి చేయగలమా అనే భయం ఉండేది. నేను చేయగలనా అనే సందేహం కలిగినప్పుడు శ్రీరామ్ ధైర్యం చెప్పేవారు. ఇవాళ ఎంతోమంది శాస్త్రి అభిమానులు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్లు మాకు సపోర్ట్ చేశారు. సిరి డెవలపర్స్ మూర్తి, సిలికానాంధ్ర, డాక్టర్ గురువారెడ్డి, వీళ్లందరి సపోర్టుతో ముందుకెళ్లాం. శాస్త్రి పాటలను, మాటలను చిరకాలం నిక్షిప్తం చేయాలనేది మా ప్రయత్నం అన్నారు.
 
డాక్టర్ గురువారెడ్డి మాట్లాడుతూ, నేను కోట్ల రూపాయలు సంపాదించుకున్నందుకు కాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తుల మధ్య గడిపినందుకు గర్విస్తున్నాను. మా పాపతో మేము నిర్మించిన లిటిల్ సోల్జర్స్ సినిమాలో మొత్తం పాటలు శాస్త్రే రాశారు. మనం మాట్లాడుకునే చిన్న చిన్న మాటలతోనే గొప్ప పాటలు రాసిన గ్రేట్ రైటర్ శాస్త్రి. కృష్ణవంశీ, శాస్త్రి కాంబోలో చాలా మంచి పాటలు వచ్చాయి. మా సన్ షైన్ ఆస్పత్రి ఆడిటోరియంలో సెట్ వేసి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది అన్నారు.
 
దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ, నాకు సీతారామశాస్త్రి గారు చాలా కాలంగా తెలుసు. ఆయన పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా. నేను ఏ సినిమా మొదలుపెట్టినా ముందు సీతారామశాస్త్రి దగ్గరకు వెళ్లి పాటల గురించి డిస్కస్ చేస్తుండేవాడిని. నా కొత్త సినిమా మొదలుపెట్టాలని ఆరేడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నా. కానీ పాటలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాస్త్రి లేకపోవడం వల్ల అనాథగా మారిన భావన కలుగుతోంది. శాస్త్రి గురించి ఇంత మంచి ఈ కార్యక్రమం శ్రీరామ్‌కు, పార్థసారధి నా కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు.
 
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, సీతారామశాస్త్రి ప్రోగ్రాం మీరు మీడియా కార్యక్రమం నిర్వహించాలని అడిగినప్పుడు అది అదృష్టంగా భావించా. సీతారామశాస్త్రి గొప్ప సినీ రచయిత. దర్శకుల మనసు తెలుసుకుని, వారికి ఏం కావాలో అది రాసిచ్చే లిరిసిస్ట్. కృష్ణవంశీకి ఆయన చిరకాలం గుర్తుండే పాటలు రాశారు. శాస్త్రి మనకు దూరమైనప్పుడు వచ్చిన అశేష జనాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ కార్యక్రమంతో శాస్త్రి పాట, మాట ప్రేక్షకులకు విస్తృతంగా చేరాలని కోరుకుంటున్నా అన్నారు.