శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (08:42 IST)

ఏపీలో శాంతించిన ఉపాధ్యాయులు.. మంత్రి సురేష్‌తో చర్చల ఫలితం

ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో అవసరమైన మార్పుల గురించి ప్రత్యక్ష కార్యాచరణ నోటీసు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్‌తో జరిపిన చర్చల అనంతరం తమ నోటీసును విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

సచివాలయంలోని విద్యాశాఖ మంత్రి సురేష్ చాంబర్లో ఉపాధ్యాయ సంఘాలు సమావేశం అయ్యాయి. బదిలీ ఉత్తర్వులలో అవసరమైన మార్పులు చేయాలని గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని కాబట్టి ఈనెల 21వ తేదీన అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల  కార్యాలయాల వద్ద పికెటింగ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నోటీస్ అందజేసింది.

మంత్రితో సమావేశంలో పలు విషయాలను కమిషనర్ చినవీరభద్రుడుకు ఉపాధ్యాయ సంఘం నాయకులు విన్నవించారు. ప్రధానంగా ఎస్‌జీటిల బదిలీలకు సంబంధించి మ్యానువల్ కౌన్సిల్ నిర్వహించాలని లేనిపక్షంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తరహాలో నిర్వహించాలని సూచించారు. సర్వీస్ పాయింట్‌లపై సీలింగ్ తొలగించాలని కోరారు.

ఉపాధ్యాయ సంఘ నాయకులు సూచించిన పలు అంశాలను కొన్నిటిని పరిశీలిస్తామని మరికొన్నింటిని వారు కోరిన విధంగా అమలు చేసెందుకు చర్యలు చేపడతామని మంత్రితో పాటు అధికారులు హామీ ఇవ్వడంతో నోటీసులో ఇచ్చిన విధంగా పికెటింగ్ నిర్వహించడం విరమించుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటించింది.

తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించినందుకు మంత్రి సురేష్‌కు ఉపాధ్యాయ సంఘ నాయకులు ఈ సంద‌ర్భంగా  ధన్యవాదాలు తెలిపారు.