జల్లికట్టు నిషేధం.. ద్రవిడ సంస్కృతిపై జరుగుతున్న దాడే: పవన్ కల్యాణ్
తమిళనాట జల్లికట్టుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో జల్లికట్టు, కోడి పందేలపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రజ
తమిళనాట జల్లికట్టుపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో జల్లికట్టు, కోడి పందేలపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన వేళ ఆ అంశంతో పాటు కోడిపందేలపై కూడా జనసేనాని పవన్ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జల్లికట్టు, కోడిపందేల నిర్వహణకు పవన్ మద్దతు తెలిపారు.
తమిళనాడులో తన సినిమా చిత్రీకరణ సమయంలో తాను ఓ విషయాన్ని గమనించానని, దక్షిణ భారత దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తోందో తాను అర్థం చేసుకున్నానని వెల్లడించారు. జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేధించారని పేర్కొన్న పవన్ కల్యాణ్... నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్, బీఫ్ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.
జల్లికట్టుపై ఇంత జరుగుతున్నా కేంద్రం మిన్నకుండా ఉండిపోయింది. కేంద్రం దక్షిణ భారత దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. జల్లికట్టు నిషేధాన్ని ద్రవిడ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. అలాగే మన సంస్కృతి, ఆవులు, మాతృభూమిపై తనకు ఎనలేని గౌరవం ఉందని తెలిపారు. తన గోశాలలో 16 ఆవులు ఉన్నాయని, తన పొలంలో జీవామృతాన్ని వినియోగించి సాగుచేస్తున్నానని చెప్పారు.