శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (11:18 IST)

మా కుటుంబంలో ఒకర్నొకరు చంపుకునేంత గొడవలు లేవు : వైఎస్ వివేకా కుమార్తె

తన తండ్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్యపై మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. తమది అతిపెద్ద కుటుంబమని గుర్తుచేసిన ఆమె.. మా కుటుంబంలో ఒకర్నొకరు చంపుకునేంత గొడవలు లేవని ఆమె స్పష్టంచేశారు. 
 
ఇదే అంశంపై ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తన తండ్రి హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోందన్నారు. కానీ, కొందరు పెద్ద పెద్ద నేతలు తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. మా నాన్న హత్యకు గురవుతారని ఎవరూ ఊహించలేదని, అలాంటి గొప్ప మనిషిని దూరం చేసుకున్న తాము ఎంతో కుమిలిపోతున్నామన్నారు. 
 
గత కొన్నిరోజులుగా తన తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన వద్దే ఉండగా, నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారన్నారు. ఆయనకు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమన్నారు. కానీ, ఆయన చనిపోయిన తర్వాత మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వస్తున్న వార్తలు  చాలా బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
నాన్న పోవడం ఎవరూ ఊహించలేదని, అయితే రాజకీయంగా డిగ్నిటీ లేకుండా కొందరు వ్యక్తులు లూజ్ టాక్ చేయడం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికింది. కుటుంబం అన్నాక కొన్ని గొడవలు ఉంటాయని, మా కుటుంబంలో 700మంది ఉన్నారని, ఇంతమందిలో కొన్ని విభేదాలు ఉండడం సహజమేనని, చంపుకునేంత గొడవలు మాత్రం తమ మధ్య లేవని స్పష్టంచేశారు. 
 
ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. జగన్‌ అన్నను సీఎం చేయాలని మా నాన్న తపన పడ్డారని, ఆయనును ముఖ్యమంత్రిగా చేసే లక్ష్యంతో పని చేసేవారని, ఆయన పోయాక ఆయనను అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇంత చెడుగా మాట్లాడుతారా? రాస్తారా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. 
 
పైగా, ఇలాంటి కిరాతక హత్యను ఇన్వెస్టిగేట్ చేయాలి కదా? సిట్ వేసి మళ్లీ రాజకీయంగా కామెంట్లు చేస్తూ.. విచారణకు ముందే కంక్లూజన్‌లు ఇస్తే ఎలా? ఇలా చేస్తే ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఊహాగానాలు ఎందుకని, అటువంటి వార్తలు రాయడం కరెక్ట్ కాదని ఆమె కోరారు. చనిపోయిన వ్యక్తి మీద నిందలు వేస్తుంటే ఆయన ఫ్యామిలీగా తట్టుకోలేకపోతున్నామని.. ఆయనను అవమానించకండి అంటూ మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది.