మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:18 IST)

కృష్ణాలో రాజ్‌నాథ్ పబ్లిక్ మీటింగ్ : చంద్రబాబును తిట్టగానే లేచిపోయిన జనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ బహిరంగ సభ జరిగింది. ఇక్కడ పార్టీలో నంబరు 3గా కొనసాగుతున్న రాజ్‌నాథ్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు. 
 
ఆయన సభ జనం లేక వెలవెలబోయింది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అగ్రనేత చెప్పే మాటలు వినడానికి ఎవరూ ఆసక్తిచూపలేదు. వచ్చిన కొద్దిమంది జనంలో సగం మంది టీడీపీ అధినేత చంద్రబాబును తిట్టగానే లేచి వెళ్లిపోయారు. దీంతో రాజ్‌నాథ్ ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. 
 
నిజానికి ఈ సభకు కనీసం వెయ్యి నుంచి రెండు వేల మంది వస్తారని బీజేపీ నేతలు భావించారు. అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు. సభా వేదిక ముందు కుర్చీలు వేశారు. అయితే, రాజ్‌నాథ్ సింగ్ ఈ సభకు ఆలస్యంగా రావడంతో పాటు భానుడి ప్రతాపం అధికంగా ఉండటంతో ప్రజలు బహిరంగ సభకు రాలేదు. 
 
వచ్చిన కొద్దిమందిని ఉద్దేశించి రాజ్‌నాథ్ ప్రసంగించడం మొదలుపెట్టారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంశల వర్షం కురిపించారు. ఆ తర్వాత చంద్రబాబును తిడుతూ విమర్శలు చేయడంతో కుర్చీల్లో కూర్చొన్నవారంతా లేచి ఎవరిదారిన వారి వెళ్లిపోయారు. 
 
దీంతో ఖంగుతిన్న రాజ్‌నాథ్ తన ప్రసంగాన్ని ఆపివేసి.. బీజేపీ నేతల వద్ద ఆరా తీశారు. ఇందుకు ఎలా జరుగిందని అడగ్గా వారు కూడా సరైన సమాధానం చెప్పలేక పోయారు. ఆ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వెళ్లిపోయారు.