1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 29 జనవరి 2022 (13:26 IST)

శ్రీనివాసా..? ఏమిటీ రికార్డులు.. 9 నిమిషాల్లో 15 వేల టోకెన్లు గోవిందా.. గోవిందా...

కరోనా ఎఫెక్ట్ ఇప్పటికీ తిరుమలపై కనిపిస్తోంది. భక్తుల రద్దీ తక్కువ చేసి కరోనా వ్యాప్తిని నిర్మూలించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారానే టోకెన్లను మంజూరు చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్సనం టోకెన్లు అయినా, ఉచిత సర్వదర్సనం టోకెన్లు అయినా ఏదైనా సరే ఆన్లైన్ లోనే తీసుకుని దర్సనానికి రావాల్సిన పరిస్థితి. 

 
ఇది గత కొన్నినెలలుగా సాగుతోంది. థర్డ్ వేవ్ కారణంగా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే. దీంతో టిటిడి నిన్న ప్రత్యేక ప్రవేశ దర్సనం టోకెన్లు, నేడు ఉచిత సర్వదర్సనం టోకెన్లను విడుదల చేసింది. అయితే ఈ టోకెన్లు కాస్త హాట్ కేకుల్లాగా వెంట వెంటనే అయిపోతున్నాయి.

 
నిన్న విడుదల చేసిన ప్రత్యేక ప్రవేశ దర్సనా టోకెన్లు కాస్త 40 నిమిషాల్లో అయిపోయాయి. 300 రూపాయల టోకెన్లను అతి తక్కువ సమయంలోనే బుక్ చేసేశారు. నేటి ఉదయం విడుదల చేసిన సర్వదర్సనం టోకెన్లు ఉచితం. ఆ టోకెన్లు కాస్త 9 నిమిషాల్లో 15వేల టోకెన్లు అయిపోయాయి. 

 
అసలు చాలామంది భక్తులకు సైట్ కూడా ఓపెన్ కాకుండా బిజీ బిజీ అంటూ వచ్చేసింది. దీంతో చాలామంది భక్తులు నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆన్లైన్ లో చాలామంది సామాన్య భక్తులు దర్సన టోకెన్లను బుక్ చేసుకోలేకున్న నేపథ్యంలో ఆఫ్ లైన్ ద్వారా అంటే కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు టిటిడి ఉన్నతాధికారులు.