శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (16:11 IST)

శవంతో నడిరోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు.. హైవేపై ట్రాఫిక్ జామ్

తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఓ గ్రామానికి చెందిన ప్రజలు శవంతో నడి రోడ్డుపై బైఠాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరి ఆందోళన కారణంగా దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. 
 
దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.
 
మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి రాస్తారోకో నిర్వహించారు. అండర్ పాస్ బ్రిడ్జి లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
ప్రమాద స్థలి వద్దకు వచ్చిన ఏసీపీ శంకర్ ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాలు కదిలాయి.