1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 మార్చి 2019 (11:25 IST)

కన్నవారి కళ్ళ ఎదుటే ఘోరం... చిన్నారిని చిదిమేసిన లారీ

మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ నిరుపేద ఇంట్లో తీరని విషాదం నెలకొంది. ఎనిమిదేళ్ళ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. లారీ ఒకటి ఢీకొనడంతో ఆ చిన్నారి లారీ వెనుక చక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది. అదీ కూడా కన్నవారు చూస్తుండగానే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ దారుణం విజయనగరం జిల్లా దేవరాపల్లి-ఆనందపురం రోడ్డులో నల్లబిల్లి జంక్షన్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.
 
ఈయనకు భార్య వరలక్ష్మి, కుమార్తె జాహ్నవి (8), కుమారుడు తనూలతో కలిసి గోపాలపట్నంలోని ఓ అద్దె ఇంటిలో నివశిస్తున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో వారంతా కలిసి అమ్మమ్మ ఊరైన విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి సొంత ఆటోలో చేరుకున్నారు. 
 
అక్కడ ఆనందంగా గడిపి తిరిగి గోపాలపట్నం తన ఆటోలోనే తిరుగు పయనమయ్యారు. శివరాత్రి కావడంతో సోమవారం ఉండి మరుసటి రోజు వెళ్లాలని అమ్మమ్మ చెప్పగా జాహ్నవి మాత్రం తన పాఠశాలకు సెలవు లేదని స్కూల్‌ వెళ్లాలని చెప్పడంతో సోమవారం ఉదయం గోపాలపట్నం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. 
 
అమ్మమ్మ ఇంటి ముందు ఉన్న ఆటో ఎక్కేందుకు ఆటో ముందు నుంచి జాహ్నవి ప్రయత్నించగా అదేసమయంలో విజయనగరం జిల్లా వావిలపాడు సమీపంలోని ఆనందపురం వైపు వస్తున్న భారీ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలిక లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. దీన్ని చూసిన ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తూ కుప్పకూలిపోయారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.