శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (21:01 IST)

రెండు వారాల్లోగా అక్రిడిటేషన్లు పునరుద్ధరించాలి: సమాచార శాఖకు హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జర్నలిస్టులకు రెండు వారాల్లోగా అక్రిడిటేషన్లు పునరుద్ధరించాలని హైకోర్టు న్యాయమూర్తి సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ను ఆదేశించారు.

సెప్టెంబర్ 30వ తేదీతో జర్నలిస్టుల అక్రిడిటేషన్ల  గడువు ముగిసినప్పటికీ వాటిని రెన్యువల్ చేయకుండా, కొత్త అక్రిడిటేషన్లు మంజూరు చేయకుండా సమాచార, పౌర సంబంధాల శాఖ తాత్సారం చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కు అనుబంధంగా ఉన్న  స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి బోళ్ళ సతీష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ తరపున ప్రముఖ  న్యాయవాది ప్రణతి రాష్ట్రంలో అక్రిడిటేషన్లు పునరుద్దరణకు నోచుకోకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను కోర్టుకు వివరించారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి రెండు వారాల్లోగా అక్రిడిటేషన్లు పునరుద్ధరించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖను ఆదేశించారు. 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబురెడ్డి  జర్నలిస్టుల సంక్షేమం కోసం హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్లపై కోత విధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జివో నెం. 142ను తీసుకు రాగా ఆ జివోకు వ్యతిరేకంగా డిల్లీబాబు రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన, వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు కనీస ఆర్థిక సహాయం చేయాలని, కరోనా సోకి మరణించిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, నర్సింగ్ సిబ్బంది, పోలీసుల మాదిరిగానే బీమా సదుపాయం కల్పించి ఆదుకోవాలని, కరోనా సోకి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని డిల్లీబాబు రెడ్డి పలు మార్గాల్లో పోరాటం చేస్తున్నారు. 

అయితే 63 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనియన్ ప్రతినిధులం అని చెప్పుకుంటున్న కొందరు నేతలు  జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తమ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దల ముందు సాగిలపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కూడా హైదరాబాద్ జర్నలిస్టులను సభ్యులుగా చూపుకుంటున్న ఒక ఫెడరేషన్ ను తమతో పాటు జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీలలో చోటు కల్పించేందుకు ప్రభుత్వ అనుకూల యూనియన్ పడరాని పాట్లు పడుతోంది.

జర్నలిస్టుల హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ను అక్రిడిటేషన్ కమిటీలలోకి రాకుండా చేసేందుకు ప్రభుత్వం, దానితో కుమ్మక్కైన యూనియన్ కుయుక్తులు పన్నుతున్నాయి.

ఈ నేపథ్యంలో జర్నలిస్టులు వాస్తవాలు గ్రహించి తమ హక్కుల పరిరక్షణ కోసం, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సాగిస్తున్న పోరాటానికి సంఘీభావంగా నిలవాలని స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  ప్రధాన కార్యదర్శి బోళ్ళ సతీష్ బాబు విజ్ఞప్తి చేశారు.