1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 18 నవంబరు 2021 (16:05 IST)

ఎయిడెడ్ జీవోపై నిర‌స‌న‌... విద్యార్థి సంఘాల ఛ‌లో అసెంబ్లీ భ‌గ్నం!

ఛలో ఏపీ అసెంబ్లీ కి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారు ఎట్టి ప‌రిస్థితుల్లో వెల‌గ‌పూడి స‌చివాల‌యానికి, అసెంబ్లీకి చేర‌కుండా పోలీసులు మూడు అంచెలుగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. విజ‌య‌వాడ‌లో ఎక్క‌డి వారిని అక్క‌డ అరెస్టు చేశారు.
 
 
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, రామకృష్ణ, ఎ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంగన్న ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబ‌రు 42, 50, 51 లను వెంటనే రద్దు చేసి,ఎయిడెడ్ విద్యా సంస్థలను ఎయిడెడ్ గా కొనసాగించాలని తాము శాంతియుతంగా నిరసన చేశామ‌ని విద్యార్థి నాయ‌కులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో చ‌ల‌నం లేక‌పోగా, నిరసన చేస్తున్న విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులపై అరెస్టులు, లాఠీ ఛార్జ్ లు  చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
 
 
తాము ఛలో అసెంబ్లీ కి పిలుపునివ్వడంతో, మార్గమధ్యంలోనే పోలీస్ అరెస్ట్ చేశార‌ని తెలిపారు. ఇకనైనా  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబ‌రు 42, 50, 51 లను వెనక్కి తీసుకోవాల‌ని, వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం మరో జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
 
విద్యార్థుల ఈ నిర‌స‌న కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, రాష్ట్ర గర్ల్స్ కో - కన్వీనర్ ప్రణీత, నగర గర్ల్స్ కమిటీ నాయకులు సుష్మ, జిల్లా అధ్యక్షుడు కోటి, విజయవాడ నగర అధ్యక్షుడు యేసు బాబు, నగర నాయకులు ప్రసాద్, అభిషేక్,మన్మధ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అరెస్ట్ అయిన ఎస్. ఎఫ్. ఐ నాయకులను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడల సుబ్బారావు, సీతారాం ప‌రామ‌ర్శించారు.