1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:50 IST)

నేడు అమరావతి రైతుల మహోద్యమ ముగింపు సభ

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన మహోద్యమ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ శుక్రవారం తిరుపతిలో జరుగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో వారు ఏకధాటిగా 44 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే ఆ ప్రాంత రైతులు, మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వామ్యులైన విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రైతుల సంఘాల సమాఖ్య ఐకాస నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభ తిరుపతి పరిధిలోని దామినీడు అనే ప్రాంతంలో జరుగనున్నాయి. 
 
ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఈ సభ సాయంత్రం 6 గంటలకు ముగించాలని హైకోర్టు షరతు విధించిన విషయం తెల్సిందే.