1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (10:26 IST)

నేడు హైదరాబాద్ నగరానికి రానున్న అమిత్ షా... వారిద్దరితో భేటీ

amit shah
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. కర్నాటకలో ఆ పార్టీ అధికారంలో ఉండగా, గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఇపుడు తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఇతర దక్షిణాది రాష్ట్రాల కన్నా కొంత ఎక్కువ బలం ఉండటంతో... వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. 
 
ఇందులో భాగంగా పార్టీలోకి కీలక నేతలను ఆహ్వానిస్తుండటంతో పాటు సినీ సెలబ్రిటీలతో కూడా చనువుగా ఉండేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ అర్థరాత్రి ఆయన హైదరాబాద్ నగరానికి రానున్నారు. మరోవైపు, రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. 
 
రాధాకృష్ణతో అమిత్ షా సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీలో ప్రధానంగా వీరు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందనే దానిపై రాధాకృష్ణను అమిత్ షా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలపై చర్చించే అవకాశం కూడా ఉంది. ఏపీ రాజకీయాలు కూడా వీరి మధ్య చర్చకు రావచ్చని తెలుస్తోంది.
 
రాధాకృష్ణతో భేటీ అనంతరం ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళితో అమిత్ షా భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని ముగించుకుని హెలికాప్టరులో భద్రాచలంకు వెళ్తారు. రాములవారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఖమ్మం చేరుకుంటారు. అక్కడ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు వెళ్తారు.