ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (19:42 IST)

నీట మునిగిన విజయవాడ.. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సీఎం ఆదేశం

cm babu flood
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. భారీ వరద కారణంగా కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా బాధితులకు ధైర్య చెబుతూ, సహాయక చర్యలను వేగవంతంగా సాగేలా చర్యలు చేపట్టారు. ఇందులోభాగహంగా, అర్థరాత్రి కూడా ఆయన వరద ముంపు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నిత్యావసరాలను దగ్గరుండి అందించారు.
 
సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో చంద్రబాబు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఒక్కరాత్రి ధైర్యంగా ఉండాలని, తాము అన్ని విధాలుగా మీకు తోడుగా ఉన్నామని ప్రజలకు హామీ ఇచ్చామని చెప్పారు. ఆ హామీని నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని అన్నారు. ఎంత మందిని రక్షించామనేదే మన ముందున్న లక్ష్యమని చెప్పారు.
 
బోట్లు సైతం కొట్టుకుపోయేంత సమస్యలు మన ముందున్నాయన్నారు. బోట్ల నుంచి వచ్చిన వారిని వెంటనే తరలించేందుకు బస్సులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా అవసరమైతే వారిని హోటళ్లలో ఉంచాలని సూచించారు. వరద బాధితుల కోసం కల్యాణమండపాలు, ఇతర కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. మొత్తం 47 సురక్షిత కేంద్రాలను గుర్తించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.