వైజాగ్ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి రాష్ట్ర శాసనసభ స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న విశాఖపట్టణంను మరో గోవాగా చేయాలన్నారు. ఇందుకోసం గోవా తరహాలో ఫ్రీజోనగా వైజాగ్ను ప్రకటించాలన్నారు. అలాగే, భర్త ఓ పెగ్గేస్తే భార్య మరింత చొరవ తీసుకుని ఐస్ క్రీమ్ తినేలా చూడాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో జరిగిన ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, విశాఖలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలంటే గోవాలా ఫ్రీ జోన్గా మార్చాలని సూచించారు. కుటుంబంతో కలిసి పర్యాటకులు సముద్ర తీరానికి వస్తారు. అక్కడ సరదాగా గడపాలి. రాత్రి 10 గంటలు దాటితే బీచ్లో ఉన్నవారిపై పోలీసులు కేసులు పెడితే పర్యాటకులు ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రజలు సరదా కోసం శ్రీలంక, గోవా వంటి ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక్కడే అలాంటి వాతావరణం కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది అని అన్నారు.
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రంలో చీకటి రోజులు నడిచాయన్నారు. ఆ గందరగోళంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు. ఇపుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, అభివృద్ది కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.