మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (12:54 IST)

రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు : కేంద్రం అఫిడవిట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్రం ఓ స్పష్టతనిచ్చింది. రాజధాని ఏర్పాటు లేదా  రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 
 
మూడు రాజధానులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం తీసుకోవడం కేంద్ర పరిధిలోదా? లేక రాష్ట్ర పరిధిలోదా? అనే అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.
 
రాష్ట్ర రాజధాని అంశంతో కేంద్రానికి సంబంధం లేదని అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. 
 
ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉండదని పేర్కొంది. రాజధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. మరోవైపు మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏపీ హైకోర్టు 10 రోజుల పాటు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. 
 
కాగా, ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్రం తన వైఖరిని తేటతెల్లం చేసింది.