1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (13:50 IST)

మరోమారు హస్తినకు సీఎం జగన్ : అప్పుల కోసమేనా?

ysjagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోమారు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన ఒక రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. ప్రతి నెలా అప్పులు తెస్తేగానీ రోజు గడవని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ అప్పుల కోసం రాష్ట్ర విత్తమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌లు రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. కానీ, అప్పు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. పైగా, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌కు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు క్లాస్ పీకినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన వారం రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాత్రం ఢిల్లీలోనే మకాంవేసి వున్నారు. 
 
ఈ క్రమంలో కేంద్రం అప్పు ఇస్తేగానీ, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలతో పాటు.. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలు కొనసాగించలేదని దైన్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ ఆకస్మికంగా ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లే ఆయన ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. 30వ తేదీన ఢిల్లీలో జరిగే జ్యూడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొంటారు. 
 
ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. ఈ సద్సులో న్యాయ, కేసుల సత్వర పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 
 
అయితే, సీఎం జగన్‌కు ఈ హస్తిన పర్యటన ఈ సదస్సు కంటే ఆయన వ్యక్తిగతగా ఉపయోగించుకోనున్నారు. ఇందులోభాగంగా, ఆయన ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కలుసుకోనున్నారు. ఆ సమయంలో అప్పులతో పాటు.. విశాఖను పాలనా రాజధానిని చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.