శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (12:33 IST)

సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉగాది వేడుకలు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని.. మంగళవారం సిఎం క్యాంప్‌ కార్యాలయంలో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. పలువురు అర్చకులను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజుల శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.
 
తెలుగు ప్రజలకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను సిఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది కూడా వానలు కురిసి పంటలు బాగా పండాలని, కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 
Jagan
 
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం తెలుగులో ట్వీట్లు చేసి ప్రజలకు అభినందనలు తెలిపారు. 
 
'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన సోదర సోదరీమణులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను' అని రాష్ట్రపతి ట్వీట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 
అలాగే ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని  ఆకాంక్షిస్తూ ప్రధాని.. తెలుగులో ట్వీట్‌ చేశారు. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.