శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (09:12 IST)

ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.
 
ఇక ఈ ఉగాదిని ప్లవ నామ సంవత్సర ఉగాదిగా పిలువడుతుంది. ఈ రోజున... అంటే ఏప్రిల్ 13న ప్లవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.  ముందుగా చెప్పుకున్నట్లు అభ్యంగన స్నానం చేసిన తర్వాతే పచ్చడి తయారుచేయాలి. ఈ ఉగాది పచ్చడిని దేవునికి సమర్పించాలి. అయితే పచ్చడి తీసుకుంటూ ‘శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే శ్లోకాన్ని చదువుతూ సేవించాలి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే... వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని మనం కోరుకుంటూ ఉగాదినాడు ఆ దేవుని శుభాశీస్సులు కోరుకోవడం అన్నమాట. 
 
ఉగాది పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, వేప పువ్వు చేదు, మామిడి పిందె వగరు, కొత్త బెల్లం తీపి, కొత్త చింతపండు పులుపు, పచ్చిమిర్చికారం, ఉప్పు. మామిడి పిందెలు తినాలి అనే సాంప్రదాయము ఉండటము మనము గమనిస్తే ఆ కాలములో వచ్చే కాయలను, పండ్లను తినడము ఆరోగ్యానికి మంచిది అని మనకు పెద్దలు చెప్పినట్టు గ్రహించవచ్చు.
 
ఉగాది పండుగనాడు భద్రాద్రి శ్రీరామచంద్ర మూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ఆద్యాత్మిక గురువులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.