శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (19:04 IST)

100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలకు ధన్యవాదాలు : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన అభ్యర్థులు విజభేరీ మోగించారు. ముఖ్యంగా, నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, కొన్ని నగర పంచాయతీలు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఫ్యాను గాలివీచింది. 
 
ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని చెప్పారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిందని అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని చెప్పారు.
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 25 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. కేవలం 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఎన్నికలకు ముందే 14వ వార్డులో వైసీపీ ఏకగ్రీవంగా గెలుపొందింది.
 
ఈ నేపథ్యంలో వైసీపీ శిబిరం ఆనందంలో మునిగిపోయింది. మరోవైపు ఈ విజయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సీఎం జగన్ అభినందించారు. కుప్పం ఎన్నికల ఫలితం తొలి రౌండ్‌లోనే తేలిపోయింది. తొలి రౌండ్‌లోనే 15 వార్డులకుగాను వైసీపీ 13 వార్డులను కైవసం చేసుకుంది.