1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (11:20 IST)

నోరు జారిన నారాయణ స్వామి.. జగన్‌పై దాడి చేసే రోజు రాబోతుందంటూ...

ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి నోరు జారారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే రోజు త్వరలోనే రాబోతుందంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత నాలిక కరుచుకుని.. పవన్ కళ్యాణ్‌పై దాడి చేసే రోజు రాబోతుందంటూ హెచ్చరించారు. 
 
ఇటీవల సాయిధరమ్ తేజ్ నటించిన "రిపబ్లిక్" ప్రీరిలీజ్ కార్యక్రమంలో హీరో పవన్ కళ్యాణ్ పాల్గొని ఏపీ ప్రభుత్వం వైఖరిని తూర్పారబట్టారు. ఏపీ మంత్రులను ఉతికి ఆరేశారు. దీంతో ఏపీ మంత్రులు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మధ్యలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి రంగప్రవేశం చేశారు. పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా దూషించారు. 
 
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అనబోయి తమ ముఖ్యమంత్రినే అన్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డిపైన దాడి చేసే రోజు రాబోతున్నది అంటూ నోరు జారారు. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ గురించి పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటికే ఆయన నోరు జారిన వ్యాఖ్యలు రికార్డు అయిపోయాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
నారాయణస్వామి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందచేసిన వస్త్రంతో సత్కరించారు.