సోమవారం, 17 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మార్చి 2025 (14:19 IST)

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

Pawan kalyan
గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో రూ.250 కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగంపై చర్చ జరిగింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ, గత వైకాపా హయాంలో మొత్తం 250 కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటుచేసుకున్నట్టు పలు నివేదికల ద్వారా వెల్లడైందన్నారు. 
 
ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హమీ పనులపై సోషల్ ఆడియా నిర్వహించిందన్నారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు జరిగినట్టు వెలుగు చూశాయన్నారు. ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్దిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్ళాయని ఆయన ఆరోపించారు. 
 
ఈ నిధుల దుర్వినియోగంపై ఆడిట్ ప్రక్రియ మొదలైందన్నారు. ఈ ఆడిట్‌ను వేగవంతం చేస్తామన్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా ఆడిట్ పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను సమీక్షించి, అవినీతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సభకు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం అనేది కేంద్ర పరిధిలో ఉంటుందని పవన్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.