శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 మే 2021 (16:47 IST)

కోవిడ్‌పై హైకోర్టు విచారణ : లోపాలు సరిదిద్దుకోవాలంటూ హితవు

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి తారా స్థాయిలోవుంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ వస్తోంది. మరోవైపు, ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో కోవిడ్ వైద్య చికిత్సపై హైకోర్టులో జరుగగా, అవి గురువారం ముగిశాయి. 
 
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై దాదాపు మూడు గంటల పాటు హైకోర్టులో విచారణ సాగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీన్ కుమార్ విచారణ చేపట్టారు. పడకలు, ఆక్సిజన్ లభ్యత, నోడల్ ఆఫీసర్ల పనితీరు, 104 కాల్ సెంటర్, వ్యాక్సినేషన్ పురోగతి తదితర అంశాలపై విచారణ చేపట్టారు. 
 
ఈ అంశాలలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా పరీక్షల ఫలితాలను కూడా వేగవంతం చేయాలని సూచించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఏమాత్రం పొంతన లేకుండా ఉందని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక.. పడకలు లేవని నోడల్ అధికారులే చెప్పడంపై కూడా హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
 
అనంతపురం ఆస్పత్రిలో కోవిడ్ మరణాలపై ఓ రిపోర్టును సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఆక్సిజన్ సరఫరాపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 
 
ఈ ఆక్సిజన్ కూడా సుదూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉండే బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా చూడాలని కేంద్రానికి సూచించింది. వీటితో పాటు కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్ల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ఎక్కువ పరీక్షలు చేసేలా సౌకర్యాలు కూడా పెంచాలని కోరింది. ఇక వ్యాక్సినేషన్‌పై కూడా హైకోర్టు ఆరా తీసింది. 45 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.