1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (18:56 IST)

10, 12 పరీక్షలు నిర్వహించి తీరుతాం : మంత్రి ఆదిమూలపు సురేష్

విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, 10, 12వ తరగతుల పరీక్షలను నిర్వహించి తీరుతామని ఏపీ విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. అందువల్ల 10, 12 పరీక్షల నిర్వహణపై కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
జూలై మొదటివారంలో ఇంటర్ పరీక్షలు, జూలై నెలాఖరున టెన్త్ పరీక్షలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ అంశంపై గురువారం సీఎం జగన్‌తో చర్చించి.. పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పరీక్షల రద్దు చేయడానికి నిమిషం పట్టదని చెప్పిన మంత్రి.. విద్యార్ధుల భవిష్యత్తు, ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు.
 
మరోవైపు, గత ప్రభుత్వాలు డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోలేదని.. వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామన్నారు. డీఎస్పీ-2008 సమస్య 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్నారు. అభ్యర్థుల భవితవ్యంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారన్నారు. డీఎస్సీ అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు.