శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (16:34 IST)

పేకాట క్లబ్బుల్లో ఉంటే తప్పేంటి? ఏం ఉరిశిక్ష వేస్తారా? మంత్రి కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని మరోమారు వార్తలకెక్కారు. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడుతున్న మంత్రి కొడాలి నాని ఇపుడు మరోమారు అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఓ మంత్రి కనుసన్నల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ముఖ్యంగా, ఈ క్లబ్బుల్లో మంత్రి కొడాలి నాని అనుచరులే ఉన్నారంటూ వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. వీటిపై మంత్రిని ప్రశ్నించగా, ఆయన మండిపడ్డారు. 
 
'ఏమో ఉంటే, ఒకరిద్దరు ఉంటారు. ఉంటే ఏమవుతుంది? ఏమైనా ఉరి శిక్ష వేస్తారా? తీసుకు వెళతారు. కోర్టుకు వెళతారు. ఫైన్ కట్టి వచ్చేస్తారు. ఏ శిక్ష వేస్తారు? పట్టుకుంటే ఫైన్ కడతారు. మళ్లీ వెళతారు. అందుకే కదా విచ్చలవిడిగా ఆడేది. భయపడంది అందుకే కదా. దీన్ని అరికట్టేందుకే వైఎస్ జగన్ గ్యాంబ్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఉరిశిక్షలు ఏమైనా ఉన్నాయా? నా తమ్ముడే ఉంటే ఉండొచ్చు. ఏం ఉరేస్తారా? దీనిపై ముఖ్యమంత్రిని అడగకపోతే ఏమవుతుంది? 
 
యాభయ్యో.. వంద రూపాయలో ఫైన్ వేస్తారు? దానికి ముఖ్యమంత్రి దగ్గరకి పరిగెత్తుకు వెళ్లాలా? నేను రోడ్డు పనుల కోసం సీఎంను కలిశాను. ప్రజల కోసమే కలిశా. గుడివాడ ప్రజలు నాలుగు సార్లు గెలిపించారు. వారి పనుల కోసమే వెళతాను. పేకాట ఆడేవారిని రోజూ నాలుగైదు చోట్ల పోలీసులు పట్టుకుంటారు. ఎక్కడో ఓ చోట పట్టుకుంటూనే ఉన్నారు. జనరల్‌గా తనిఖీలు జరుగుతుంటాయి. నిన్నటి ఘటనతో నామీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అంతేకాకుండా, పేకాట క్లబ్బులు మూసేయించామని అన్నారు.. మళ్లీ ఎలా వచ్చాయని అడిగితే అదే నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. 'ఓసారి మూసేస్తే ఆగిపోతుందా? ఎక్కడెక్కడో ఆడతారు. పలానా చోట ఆడుతున్నారని సమాచారం ఇవ్వండి. 24 గంటల్లో రైడ్ చేయిస్తా' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.