మంగళవారం, 20 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జూన్ 2024 (09:32 IST)

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

pinnelli ramakrishna reddy
గత దశాబ్దకాలంగా మాచర్లలో అరాచకాలకు పాల్పడుతూ, ప్రజలను వేధిస్తూ వచ్చిన పిన్నెల్లి సోదరులపై పోలీసులు కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. ఇందులోభాగంగా, వారిపై తొలిసారి రౌడీషీట్‌ను తెరిచారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన ఏపీలో జరిగిన పోలింగ్‌ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించాడు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తపై కూడా దాడి చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే ఆయనపై కేసు నమోదైవుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్‌ను తెరిచారు. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 
 
ఏపీలో జరిగిన పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై తన అనుచరులతో కలిసి దాడి చేయించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదుకాగా, ప్రస్తుతం బెయిలుపై బయటవున్నారు. తాజాగా పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్ తెరిచినట్టు సమాచారం.