శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (19:02 IST)

మూడో కన్ను తెరవడానికి దెయ్యానివా... రాక్షసుడివా?

తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మూడో కన్ను తెరవడానికి దెయ్యానివా...రాక్షసుడువా? అని కేసీఆర్ పైన ఆగ్రహం వ్యక్తంచేశారు.


సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్న తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రిది నోరా... మున్సిపల్ డ్రైనేజా అని అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనన్నారు. అవన్నీ మరిచి, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేలా బీజేపీతో కలిసి టీడీపీ పతానానికి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. 
 
తెలంగాణాలో ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ఇష్టారాజ్యంగా సభ్యసమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాల్లో దిగుజారుడుతనానికి కేసీఆర్ తీరు పరాకాష్ట అని అన్నారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సభ్యతసంస్కారం మరిచి టీఆర్ఎస్ అధినేత ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు సీఎంగా, ప్రతిపక్ష నేతగా పదేళ్లు పని చేసిన చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలడం సబబు కాదన్నారు. టీడీపీలో కేసీఆర్ ఉన్నప్పుడే సీఎం చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారన్నారు. 
 
ఓటమి భయంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తెలంగాణాలో టీడీపీకి ఆఫ్ పర్సంటేజీ ఓట్ల శాతం మాత్రమే ఉందని కేసీఆర్ అంటున్నారని, అటువంటప్పుడు తమ పార్టీని చూసి ఆయనెందుకు భయపడాలని ప్రశ్నించారు. గురువారం జరిగిన ఎన్నికల సభలో గంట పాటు కేసీఆర్ మాట్లాడితే, అందులో అరగంట పాటు టీడీపీ, చంద్రబాబు గురించి మాట్లాడారన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన టీఆర్ఎస్ పార్టీని స్థాపించే వారా? అని ప్రశ్నించారు. మూడో కన్ను తెరిస్తే, చంద్రబాబు నాయుడు భగ్గుమని మాడిపోతారని కేసీఆర్ అంటున్నారని, ఆయనేమైనా దెయ్యమా...రాక్షసుడా? అని అన్నారు. 
 
ఆనాడు మాకెంత ఇచ్చావు?
రాబోయే ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ పార్టీకి సీఎం చంద్రబాబునాయుడు డబ్బులిస్తున్నారని కేసీఆర్ అనడం సరికాదన్నారు. 2009 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబునాయుడు కాళ్ల ముందు ఇదే కేసీఆర్ సాగలబడి, టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారన్నారు. ఆనాడు తమకేమైనా డబ్బులిచ్చావా? అని మంత్రి నక్కా ఆనందబాబు నిలదీశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. గత నాలుగున్నర ఏళ్లలో తెలంగాణాలో ఏమి అభివృద్ధి చేశావో చెప్పాలని కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, కేసీఆర్‌వి అన్నీ దొంగ దీక్షలేనని ఎద్దేవా చేశారు. 
 
కేసీఆర్ దీక్షకు సంబంధించి అప్పటి పత్రికల్లో, టీవీల్లో వచ్చిన క్లిప్పింగులు చూస్తే ఆయన గుట్టురట్టవుతుందన్నారు. తెలంగాణకు టీడీపీతోనే న్యాయం జరిగిందన్నారు. ఎన్టీఆర్... తెలంగాణలో పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు. బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టారన్నారు. చంద్రబాబునాయుడు కృషితోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. హైదరాబాద్ రోడ్లు చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. తామంతా తెలంగాణ అభివృద్ధికి సంపాదిస్తే పెడితే, సీఎంగా ఆయనేమీ చేశారని ప్రశ్నించారు. 
 
తాము చేసిన అభివృద్ధినే ఏపీలో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. కేసీఆర్ సాధించిన ప్రగతి ఎంటో చెప్పాలన్నారు. దళితులకు మూడెకరాల అని చెప్పి ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఇచ్చావు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎంతమంది పేదలకు కట్టిచ్చావు అని మంత్రి నక్కాఆనందబాబు ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పక్కదోవ పట్టించడానికి, ఆయన తన అమసర్థతను కాపాడుకోడానికి సీఎం చంద్రబాబునాయుడుపై కేసీఆర్ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.