శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:05 IST)

నాడు ఆటో డ్రైవర్ .. ఇపుడు ఆటో సర్పంచ్ .. ఎవరు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అనేక మంది సామాన్యులు ఇపుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇలాంటి వారిలో వివిధ వృత్తులు చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నవారు ఉన్నారు. ఈ క్రమంలో నిన్నామొన్నటివరకు ఆటో డ్రైవరుగా ఉన్న వ్యక్తి ఇపుడు ఆటో సర్పంచ్‌గా మారిపోయాడు. దీనికి కారణం.. గ్రామపంచాయతీ ఎన్నికలే. 
 
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జంగాలిపాలెం సర్పంచ్‌ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన గొరపల్లి నరసింగరావు మూడో ప్రయత్నంలో విజయం సాధించాడు. అతడు 1995 నుంచి టీడీపీ కార్యకర్త. చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. 
 
2006 నుంచి ఆటో డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేవాడు. 2006, 2013లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. 
 
అయినా నిరాశ చెందకుండా తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి 94 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పంచాయతీలోని 8 వార్డులకుగాను ఆరు టీడీపీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. దీంతో ఆ గ్రామంలో తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.