తిరుపతిలో 'లెజెండ్' హల్చల్.. కరచాలనం కోసం ఎగబడిన అభిమానులు
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హల్చల్ చేస్తున్నారు. దీంతో ఆయనను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీ పడుతూ ఎగబడుతున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ మహానాడులో బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన విషయం తెల్సిందే.
పార్టీ జెండా రంగు పసుపు కావడంతో ఆ రంగు షర్టును బాలయ్య ధరించారు. మొదటగా తిరుపతి టౌన్ క్లబ్ వద్ద ఎన్టిఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బాలయ్య నివాళులు అర్పించారు. బాలయ్య నివాళులు అర్పించిన తరువాత అభిమానులు ఆయనకు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. వచ్చిన ప్రతి అభిమానితో బాలయ్య కరచాలనం చేశారు. అలాగే అభిమానులతో ఫోటోలు కూడా దిగారు.
మహానాడు జరిగేంత సేపు బాలయ్య అభిమానులకు అభివాదం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అప్పుడప్పుడు మీసం తిప్పుతూ, కాళ్లపై కాళ్లు వేసుకుని హుందా తనాన్ని ప్రదర్శించారు. మహానాడుకు వచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలు బాలయ్యను చూస్తూనే ఉన్నారు.