1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (18:41 IST)

బతికితే సింహంలా బతకాలి.. చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి

vijayasai - babu
"నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. 
 
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!!" ఈ వ్యాఖ్యలు టాలీవుడు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ అన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. 
 
హీరో నందమూరి తారకరత్న మృతితో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో నందమూరి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయింది. గత నెల 27వ తేదీన గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు మృత్యువు పోరాటం చేసి చనిపోయారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌లోని మోకిల నివాసానికి తీసుకొచ్చారు. అక్కడకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలు వచ్చిన నివాళులు అర్పించారు. 
 
వీరిద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి.. విజయసాయి రెడ్డి మరదలి కూతురు కావడంతో ఆయన తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వైకాపా ఎంపీ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలోనే రాజకీయాలను పక్కనబెట్టి జరగాల్సిన విషయాలపై చంద్రబాబు, బాలకృష్ణలతో కలిసిపోయి మాట్లాడారు. అయితే, ఈ ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్.. రాజకీయంగా బద్ధశత్రువులైన బాబు, విజయసాయి ఒక్క చోట కూర్చోవడాన్ని తప్పు బట్టారు. బతికితే సింహంలా బతకాలి, చనిపోతే సింహంలా పోవాలంటూ పై విధంగా ట్వీట్ చేశారు.