1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

పవన్ కళ్యాణ్ దూరమైతే... ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదట...

lokesh pawan
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటలన ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా దూరమైతే ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకోకుంటే ఎప్పటికీ బలోపేతం కాబోదని వారు ప్రాయపడినట్లు సమాచారం. 
 
ముఖ్యంగా, బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లినప్పుడు 'మీ ఢిల్లీ పెద్దల సపోర్ట్ లేకుండానే జగన్ ఇన్ని అరాచకాలు చేస్తున్నాడా? నెల్లూరులో జిల్లా బీజేపీ నాయకుడిపై పోలీసుల దౌర్జన్యం, ధర్మవరంలో బీజేపీ కార్యాలయంలోకి చొరపడి విధ్వంసం సృష్టించడం, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో దాడి, ఆదినారాయణ రెడ్డి లేడా అంటూ వెతకడం... ఇలా పార్టీ నేతలపై జగన్ దాడులు చేయిస్తున్నాడని గుర్తు చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఢిల్లీ నుంచి మద్దతు లభించడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి. 
 
బీజేపీకి చెందిన ఒక జిల్లా స్థాయి నాయకుడు మాట్లాడుతూ 'మా పార్టీ సిద్ధాంతం సనాతన ధర్మం.. హిందూ ఆలయాలపై దాడులు చేయించే వ్యక్తి వెంకటేశ్వరుడి ప్రతిమ ఇవ్వగానే మద్దతివ్వడం, ఇదేం రాజకీయం? ఏపీ ప్రజలు అంత అమాయకులా?' అని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ పెద్దలు ఫోన్లు చేయడంతో వైసీపీతో సఖ్యతగా ఉన్న నలుగురు నాయకులు తప్ప మిగతా అందరూ సానుకూలంగానే ఉందంటూ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు త్వరలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.