1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 14 ఆగస్టు 2020 (16:45 IST)

ఆ విషయంలో సాధినేని యామినిని ఇరికించారా? పోలీసు స్టేషన్‌లో?

ఎపి బిజెపి నేత సాధినేని యామినిపై పోలీసులు కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయోధ్య రామాయల నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టిటిడిపై సాధినేని యామిని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టిటిడి విజిలెన్స్ విభాగం తిరుమల టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపిసీ సెక్షన్ 505(2), 500 కింద కేసులు నమోదు చేశారు. 2019 సంవత్సరం ఎన్నికలకు ముందు వరకు పార్టీ అధికార ప్రతినిధిగా టిడిపిలో యాక్టివ్ రోల్ పోషించారు సాధినేని యామిని. 
 
ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో ఆ తరువాత కాలంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా తాజా రాజకీయ పరిణామాలతో హాట్ కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు యామిని.
 
అయితే బిజెపి నేతపై కేసు పెట్టడం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. బిజెపి నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది అయోధ్య భూమిపూజకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. వారందరినీ వదిలేసి యామినిపై కేసులు పెట్టడానికి ఆమె గతంలో తెలుగుదేశంలో ఉండటమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
టిడిపి నుంచి బిజెపిలోకి యామిని రావడం.. స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఆమె పైన కేసులు పెట్టినట్లు ప్రచారం బాగానే సాగుతోంది. కేసు పెట్టిన తరువాత యామిని ఖచ్చితంగా పోలీసు స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.