శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (17:57 IST)

అశోక్ గెహ్లాట్ సర్కారుపై అవిశ్వాస పరీక్ష : బీజేపీ నిర్ణయం

రాజస్థాన్ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'ప్రభుత్వ పక్షంలో చెప్పలేనన్ని విభేదాలున్నాయి. వారు పోట్లాడుతున్న పరిస్థితి చూస్తుంటే... వారు బల పరీక్ష వైపే మొగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ... మేమే సర్కారుపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నాం' అని చెప్పుకొచ్చారు. 
 
నిజానికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వెలుగు చూశాయి. యువనేత సచిన్ పైలట్ తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో కలుపుకుని తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన బీజేపీతో చేరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ, ఆయన వ్యూహాలు ఫలించలేదు. దీంతో పాటు.. సచిన్‌తో కాంగ్రెస్ పెద్దలు మంతనాలు జరిపారు. ఫలితంగా సచిన్ పైలట్ దిగివచ్చారు. 
 
మరోవైపు, ఈ నెల 14వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంకానుంది. అదేరోజున విశ్వాసపరీక్షకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సిద్ధమయ్యారు. బల పరీక్ష నిర్వహించి తీరుతామన్న దృఢ సంకల్పంతో సీఎం గెహ్లాట్ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ సీఎం వసుంధరతో పాటు ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కూడా హాజరయ్యారు.
 
ఈ సమావేశంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై బీజేపీ నేత గులాంచంద్ కటారియా మాట్లాడుతూ... 'కాంగ్రెస్ బట్టను తిరిగి కుట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ అది చిరిగిన బట్ట. దానిని అతికించడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. ఇది తొందరగా కూలిపోయే సర్కార్' అని వ్యాఖ్యానించారు. కాగా, రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలం 107 కాగా, బీజేపీ సభ్యుల సంఖ్య 76గా ఉంది.