1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:25 IST)

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ పేలుడు...పూర్తిగా ధ్వంసమై ఇల్లు

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులో ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇల్లంతా ధ్వంసం అయ్యింది. చుట్టుపక్కల ఇల్లు కూడా ధ్వంసం అయ్యింది. టపాసుల తయారీకి ఉపయోగించే పదార్థాల కారణంగానే ఈ పేలుడు  సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే, పేలుడు సమయంలో చుట్టు పక్కన ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. పేలు సంభవించిన ఇల్లు సూర్యనారాయణ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. 
 
ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో గ్రామంలో తీవ్ర అలజడి నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు సంభవించిన ఇంటిని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
భీమవరం ప్రాంతంలో గతంలోనూ ఓసారి భారీ పేలుళ్లు సంభవించాయి. గతంలో భీమవరం ఉండి రోడ్డులో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉండి రోడ్డులో స్కాప్ యార్డులో పేలుడు సంభవించగా.. భారీ నష్టం చోటు చేసుకుంది. ఆ పేలుడు సంభవించిన కొంతసేపటి తరువాత బైపాస్ రోడ్డు మీదుగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీ పేలింది. ఈ పేలుళ్లకు సంబంధించి ఆధారాలు ఇప్పటికీ దొరకలేదు. దాంతో ఆ కేసు మూలకు పడినట్లయ్యింది. తాజాగా ఈ ప్రాంతంలో మళ్లీ పేలుడు సంభవించడంతో స్థానికంగా తీవ్రకలకలం రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.