ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (11:17 IST)

సీఎం జగన్‌కు ఊరట కల్పించిన ప్రత్యేక కోర్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శనివారం ఆ రాష్ట్ర సచివాలయంలోకి తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయనకు సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి ఊరట లభించింది. ఆయనపై నమోదైవున్న అవినీతి కేసులో విచారణ హైదరాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసులో విచారణకు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాను ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని, అందువల్ల విధుల నిర్వహణలో భాగంగా కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని, కోర్టులో హాజరు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 317 కింద జగన్ న్యాయవాది అశోకరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఇదే కేసులో ఏ-2 నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులతో వరుస సమావేశాలు ఉన్నందున కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లను కోర్టు విచారణకు స్వీకరించింది. పైగా, సీబీఐ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో జగన్‌తో పాటు.. విజయసాయి రెడ్డికి కూడా ఊరట కల్పించింది.