1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (17:03 IST)

ఎల్జీ పాల్జీమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులకు తెదేపా ఆర్థిక సాయం

విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, 500 మందికి పైగా బాధితులుగా మారారు. వందల సంఖ్యలో కోళ్లు, పశువులు, మేకలు, గొర్రెలు చనిపోయాయి. ఈ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఏపీ సర్కారు కోటి రూపాయల చొప్పున ఆర్థిక  సాయం చేసింది. 
 
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరపున కూడా రూ.50 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నుంచి ప్రారంభమైన ఆ పార్టీ మహానాడులో ప్రకటించారు. ఈ మహానాడును జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇది రెండు రోజుల పాటు జరుగనుంది. 
 
అంతేకాకుండా, రంగనాయకమ్మ అనే వృద్ధురాలి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకుగాను సీఐడీ కేసు పెట్టడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఆమెకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
అలాగే, చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా 38 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో.. 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉందని గుర్తుచేశారు. మహానాడులో పాల్గొన్న ఆయన అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
 
'సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం. కార్యకర్తలు భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశారు. టీడీపీ పథకాలు దేశానికే మార్గదర్శకమయ్యాయి. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా పార్టీని వదలలేదని కార్యకర్తలు చెప్పారు. కార్యకర్తల త్యాగాలు మర్చిపోలేనివి
 
శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలని దెబ్బతీశారు. వైసీపీ నేతలు ఉన్మాదుల మాదిరిగా వ్యవహరించారు. చేయని తప్పుకు టీడీపీ కార్యకర్తలు జైళ్లకు వెళ్తున్నారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. ఆర్థికంగా కుంగదీసినప్పటికీ పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం' అని చంద్రబాబు అన్నారు.