శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (12:42 IST)

అమరావతిలో చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు: మంత్రి కొడాలి నాని

అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు.సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు.
 
‘అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి.

ఆంబోతులా అచ్చెన్నాయుడు అరుస్తున్నా.. కుక్కలా బుద్ధ వెంకన్న మొరుగుతున్నా మేం అదిరేది లేదు, బెదిరేది లేదు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి..?’ అని కొడాలి నాని ప్రశ్నించారు.
 
‘ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే మాకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యం.

ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం. దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి’ అని సీఐడీని మంత్రి నాని కోరారు.