1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (10:53 IST)

విజయవాడలో తెలుగుదేశం ద్రోహులపై చంద్రబాబు చర్యలు?

చరిత్రలో ఊహించని విధంగా పరాజయం పాలయిన తెలుగుదేశం పార్టీ తన స్వంత ఇంటిని చక్కదిద్దుకుంటుందా..? పురపాలక, మున్సిపల్‌ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై సమీక్ష నిర్వహించుకుంటుందా..? పురపాలక ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ధైర్యం అధినేతకు ఉందా..?

పార్టీ కార్యకర్తలు, సానుభూపతిపరులు ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేస్తుంటే, పదవులు అనుభవించి, ఇంకా పదవులపై కూర్చున్న ఇంట్లో ఉన్న నాయకులను పక్కన పెడతారా..? ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న 'విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం'లో పార్టీ ఓటమికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటారా..?

రాజధాని నగరమైన 'విజయవాడ'లో పార్టీకి ద్రోహం చేసిన ద్రోహులపై అధినేత 'చంద్రబాబు' చర్యలు తీసుకుంటారా..? లేక వదిలేస్తారా..? అనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. 
 
పోలింగ్‌కు రెండు రోజుల ముందు 'కుల' ప్రస్తావన తెచ్చి పార్టీకి ద్రోహం చేసిన 'విజయవాడ' పేపర్‌ టైగర్స్‌పై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

పార్టీ మంచి స్వింగ్‌లో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలో టిడిపి ఒక కులానికే చెందిందని వ్యాఖ్యలు చేసిన 'బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా, బోండా ఉమామహేశ్వరరావు'లపై చర్యలు తీసుకుని 'చంద్రబాబు' పార్టీని గాడిలో పెట్టాలని వారు కోరుకుంటున్నారు.

ప్రత్యర్థుల వద్ద నుంచి సొమ్ములు తీసుకున్నారని, పార్టీ క్రమశిక్షణను వారు ఉల్లంఘించారని, పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడి పార్టీకి ఘోరఓటమికి కారణమైన వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదంటున్నారు.

పట్టుమని పది ఓట్లు తేలేని వారిని పార్టీ అందలం ఎక్కించిందని, దాని ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని, ఇప్పటికైనా ఇటువంటి వారిపై వేటు వేయాలని పట్టణ టిడిపి కార్యకర్తలు, నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘోరపరాజయాన్ని చవిచూసిన గడ్డుపరిస్థితుల్లో అధినేత వారిపై చర్యలు తీసుకుంటారా..? ఏమో చూడాలి మరి.