కరెంట్ లేకపోతే నన్ను తిడతావా..?: ఇదేంట్రా బాబు.. ఏపీ సీఎం
తెలంగాణలో కరెంట్ కష్టాలకు చంద్రబాబే కారణమని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను నమ్మి గెలిపించారని, చేతిలో అధికారం ఉంచుకుని కూడా సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించకుండా... తనపై నెపం నెడుతూ తప్పించుకోవాలని చూస్తున్నారని కేసీఆర్ను ఉద్దేశించి బాబు మండిపడ్డారు.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఎన్నో ఇబ్బందులు వచ్చాయని...దానికి కేంద్రాన్నో, పక్క రాష్ట్రాల్నో నిందించే ప్రయత్నం తాను చేయలేదని చెప్పారు. ఏపీకు ఉన్న అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నానని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర విజభన జరిగిన తర్వాత ఏపీకు ఆర్థిక లోటు, తెలంగాణకు కరెంట్ కష్టాలు ఉంటాయని తాను ముందు నుంచి చెబుతూ వస్తున్నానన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ముందుచూపుతో వెళ్లాలని, ఏపీ ముఖ్యమంత్రిగా తాను అదే చేస్తున్నానన్నారు.
తాను గతంలో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి, తెలంగాణలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఉండేదని... దానిని ఛాలెంజ్గా తీసుకుని 2004 నాటికి తెలంగాణలో మిగులు కరెంట్ తెచ్చానన్నారు. హుదూద్ తుపానుకు ఉత్తరాంధ్రలో 30 వేల విద్యుత్ స్తంభాలు, ఐదు వేల ట్రాన్స్ ఫార్మర్లు, కొన్ని వేల చెట్లు పడిపోయాయని తెలిపారు.
రెండు, మూడు నెలల వరకు కరెంట్ సరఫరా అసాధ్యమని అధికారులు అంటే, తాను దానిని చాలెంజ్గా తీసుకుని వారం రోజుల్లో కరెంట్ తెచ్చి చూపించానని బాబు వ్యాఖ్యానించారు.