బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:45 IST)

బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారంపై సోము వీర్రాజు ఆగ్రహం

విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేస్తున్న హిందూధర్మ ప్రచార కార్యక్రమాల్లో క్రైస్తవ మత ప్రచారాన్ని ఎలా నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి అసలు హిందూ ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేదని, హిందూ ధర్మ వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతి నిత్యం ఎన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నా, పాలకుల అలసత్వం - అధికారుల నిర్లక్ష్యంతో అన్యమత ప్రచారానికి ప్రోత్సహిస్తున్నట్లుగా కనపడుతోందని సోము వీర్రాజు తీవ్రంగా విమర్శించారు.
 
దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ స్వీయ పర్యవేక్షణలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రకటించుకున్న ప్రభుత్వం, ఈ ఘటనపై ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మత ప్రచార బోధకులు ఇంద్రకీలాద్రి చుట్టూ 'అన్యమత ప్రచారం సాగిస్తూ, మతమర్పిడులు ప్రోత్సహిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని, ఈ సంఘటనలపై వెంటనే అధికార యంత్రాంగం స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
 
శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఏడో తేది రాత్రి 8 గం.ల నుండి 9 గం.ల మధ్యలో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. దేవీ నవరాత్రుల ప్రచారం కోసం దేవాలయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రచార ఎల్.ఇ.డి. డిజటల్ వ్యాను ద్వారా క్రైస్తవ అన్యమత ప్రచారం దేవాలయ పరిసరాల్లో జరిగింద‌ని పేర్కొంటున్నారు. హిందూ సమాజానికి అత్యంత ప్రమాదకరమైన ఈ పరిణామాన్ని విశ్వహిందూ పరిషత్ ఖండిస్తూ , క్రైస్తవ అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించిన దేవాలయ పాలక మండలి పైన, అధికారుల పైన, వ్యాను కాంట్రాక్టరు, సిబ్బందిపైన వెంట‌నే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.