శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సచివాలయం సిబ్బంది భాద్యతాయుతంగా విధులు నిర్వ‌హించాలి

విధి నిర్వహణలో ఉన్న సచివాలయం సిబ్బంది బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా చూడాలని, సకాలంలో విధులకు హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. న‌గర పర్యటనలో భాగంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శ‌నివారం ఉద‌యం భవానీపురం చెరువు సెంటర్ నందు నిర్మాణం పూర్తి కాబడిన సి.సి రోడ్డు పనులను పరిశీలించారు. అనం‌త‌రం 156, 157, 158, 159 సచివాలయ కార్యాలయాల‌ను ఆకస్మిక తనిఖి నిర్వహించి అక్కడ ఉన్న రికార్డులను పరిశీలించారు. 
 
ఈ సందర్భంగా సచివాలయంలో ఇరువురు సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకా‌‌పోవ‌డం గమనించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గుణదల ప్రాంతంలోని 14వ వార్డ్ సచివాలయాన్ని పర్యవేక్షించి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఆయా సచివాలయాల్లో సిబ్బంది యొక్క మూమేట్ రిజిస్టర్, పెన్షన్ వివరాలు, ప్రజల నుండి వచ్చిన అర్జిలను నమోదు చేసే రికార్డులు సక్రమంగా నిర్వహిస్తుంది, లేనిది పరిశీలించారు. 
 
ఈ సందర్భంలో వార్డు సచివాలయం నందు విధిగా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పధకాల పోస్టర్స్, అర్హుల జాభితాను ప్రదర్శించాలని ఆదేశిస్తూ, క్షేత్రస్థాయి సిబ్బంది భాద్యతగా వారికి కేటాయించిన విధులను నిర్వహించాలని ఆదేశించారు. అన‌త‌రం గుంటతిప్ప డ్రెయిన్ నందు పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఎల్ అండ్ టి ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి నిర్మాణ పనులు వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు. 
 
కరెన్సీనగర్ సచివాలయం భవనంపై జరుగుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు, బృందావన్ కాలనీ నందు నిర్మాణంలో ఉన్న గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులు పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నారాయణమూర్తి, వై.వి.కోటేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.