ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (17:34 IST)

ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా : ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబరు కూడా...

ఇసుక అక్రమాల కట్టడికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇసుకను అక్రమంగా తవ్వడం, రవాణా చేయడం, నిల్వచేయడం, అధిక ధరలకు విక్రయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టంచేసిన ప్రభుత్వం ఈ విషయంలో పౌరులనుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్‌కు కాల్‌చేసి కాల్‌ సెంటర్‌ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. 
 
ఫిర్యాదులు స్వీకరిస్తున్న తీరును, వాటిని ఎవరికి నివేదిస్తున్నారన్న అంశాలను కాల్‌ సెంట్‌ ఉద్యోగి నుంచి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలో తీసుకోవాల్సిన సమాచారంపై కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. 
మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్‌ సెక్రటరీ నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్, టాస్క్‌ఫోర్స్‌ ఛీఫ్‌ సురేంద్రబాబు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహారించాలని టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ సురేంద్రబాబును సీఎం ఆదేశించారు. కాల్‌సెంటర్‌ ద్వారా వచ్చే సమాచారాన్ని ఇసుక అక్రమాల నిరోధానికి వాడుకోవాలని, తప్పులు ఎవరు చేసినా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఈ సందర్భంగా స్పష్టంచేశారు. 
 
వారోత్సవాలు విజయవంతం
 
వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశాలతో ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అవుతున్నాయి. 
 
రోజువారీ ఉత్పత్తి లక్ష టన్నుల నుంచి 2 లక్షల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని వారోత్సవాలు ప్రారంభమైన 48 గంటల్లోనే అధికారులు అధిగమించారు. వరదలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తికి అనుగుణంగా రవాణా వాహనాలను తగినన్ని అందుబాటులోకి ఉంచడంతో ఇది విజయవంతమైందని అధికారులు చెప్పారు. 
 
గత శనివారం నాటికి ఒక్క రోజులోనే 2,03,387 టన్నులు ఇసుకను అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో కేవలం 50,086 టన్నులు మాత్రమే బుక్‌ అయ్యింది. ఆదివారం నాటికి డిమాండ్‌ సగానికి తగ్గిపోయింది. రానున్న రోజుల్లో సరాసరి 40వేల టన్నుల వరకూ రోజువారీ డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు